
పైసా పైసా కూడబెట్టి పిల్లల చదువులు, పెళ్లిల్లు, భవిష్యత్ అవసరాల కోసం కట్టుకున్న చిట్టీల మొత్తాన్ని కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగింది. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. యాజమాన్యం బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని దాదాపు రికవరీ చేశారు. బుధవారం (ఆగస్టు 05) దాదాపు రెండున్న కోట్ల రూపాయలను పంపిణీ చేశారు పోలీసులు.
కనకదుర్గ చిట్ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి సంవత్సరాలుగా తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 93 మంది బాధితులకు న్యాయం చేశారు పోలీసులు. దాదాపు 93 మంది బాధితులకు రావలసిన 2 కోట్ల 34 లక్షల 59 వేల 991 రూపాయల- విలువైన చెక్కులను అందజేశారు.
కనకదుర్గ చిట్ఫండ్స్ యాజమాన్యం బాధితులకు చెల్లించాల్సిన డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మరికొన్ని ఫిర్యాదులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని నిందితుడికి తెలియజేయగా, బాధితులందరికీ చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అంగీకరించాడు. అందులో భాగంగా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో 93 మంది బాధితులకు రావలసిన రూ.2,34,59,991/- విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ప్రజలు అధిక లాభాల పేరుతో వచ్చే మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చట్టబద్ధంగా నమోదైన చిట్ఫండ్ సంస్థల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధత ఉన్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించారు.