Reading Time: < 1 minute
Mohan Bhagwat Gen Z Protests Not Anti National Rss Chief Democracy

నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఈ ఉద్యమంపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి.

తాజాగా ఇదే అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు చేస్తున్నారనే కారణంతో జెన్-జీ (Gen Z) యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. వాళ్లంతా మన దేశ భవిష్యత్తు అని.. వాళ్లంతా మనవాళ్లేనని, వారి సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఒకటిగా పేర్కొంటున్న ‘ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ యూనైటింగ్ ది వరల్డ్, ది ఇండియన్ వే’ సదస్సులో మోహన్ భాగవత్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘జెన్ జీ యువత ఆందోళనలు చేస్తుంటే వారు దేశ వ్యతిరేకులు కారు. వారు మనవాళ్లే.. మన తర్వాతి తరం. వారు ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుని, వారి ఆందోళనలను పరిష్కరించాలి.’’ అని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయని సూచించారు. యువత అసలు నిరసనలు చేయకూడదని తాను చెప్పడం లేదని.. కానీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి ఒక విధానం ఉంటుందని.. ఆ మార్గంలోనే తమ అభిప్రాయాలను వెల్లడించాలని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.

ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నిరసనల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాల మధ్య యువత ఆందోళనలపై మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.