
Biogas Blended CNG: దేశంలో పెట్రోల్లో ఇథనాల్ (E20) మిశ్రమాన్ని ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో సీఎన్జీ (CNG)లో కూడా బయోగ్యాస్ను మిళితం చేసి వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గం రూ.23,731 కోట్ల వ్యయంతో గోబర్ధన్ (GOBARdhan) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని పెంచడంతో పాటు, దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం.
గోబర్ధన్ పథకం అంటే ఏమిటి?
గోబర్ధన్ అంటే Galvanizing Organic Bio-Agro Resources Dhan. ఈ పథకాన్ని 2027 నుంచి 2036 ఆర్థిక సంవత్సరాల మధ్య అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచడం, ఆ గ్యాస్ను సీఎన్జీ నెట్వర్క్లో వినియోగించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
బయోగ్యాస్ ఎలా తయారవుతుంది?
కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG)ను పశువుల పేడ, పంట అవశేషాలు, పురపాలక వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, చెరకు కర్మాగారాల వ్యర్థాలు వంటి సేంద్రీయ పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. శుద్ధి ప్రక్రియ అనంతరం ఈ గ్యాస్ రసాయనికంగా సహజ వాయువుకు చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇప్పటికే ఉన్న సీఎన్జీ (CNG), పీఎన్జీ (PNG) పంపిణీ వ్యవస్థల ద్వారానే దీన్ని సరఫరా చేయవచ్చు.
CNG కార్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఉపయోగిస్తున్న CNG కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయో-CNG రసాయనిక లక్షణాలు సహజ వాయువుకు సమానంగా ఉండటంతో వాహనాల్లో ఎలాంటి ఇంజిన్ మార్పులు లేదా హార్డ్వేర్ అప్గ్రేడ్ అవసరం ఉండదు. పెట్రోల్లో E20 వినియోగానికి ప్రత్యేక ఇంజిన్ అవసరమైనట్లుగా, బయో-CNG విషయంలో అలాంటి నిబంధనలు ఉండవు.
దశలవారీగా పెరిగే బయోగ్యాస్ మిశ్రమం
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం నగర గ్యాస్ పంపిణీ సంస్థలకు బయోగ్యాస్ మిశ్రమం తప్పనిసరి కానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతం బయోగ్యాస్ మిశ్రమంతో ప్రారంభించి, 2027-28లో 4 శాతానికి, 2028-29 నుంచి 5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం
ఈ పథకం అమలుతో దేశీయంగా బయో-CNG ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే దశాబ్దంలో బయోగ్యాస్ ఉత్పత్తి దాదాపు 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో విదేశాల నుంచి సహజ వాయువు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశ విదేశీ మారక వ్యయాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పర్యావరణానికీ మేలు.. రైతులకూ లాభం
సేంద్రీయ వ్యర్థాలను వినియోగించి ఇంధనం ఉత్పత్తి చేయడం వల్ల వ్యర్థాల నిర్వహణ మెరుగుపడటమే కాకుండా, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో రైతులకు పంట అవశేషాలు, పశువుల పేడ వంటి వనరుల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశాలు కూడా ఈ పథకం ద్వారా ఏర్పడనున్నాయి. దేశంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా గోబర్ధన్ పథకం కీలక అడుగుగా భావిస్తున్నారు.