ఈ ప్రత్యేక పట్టుచీరను స్వచ్ఛమైన పట్టు దారాలతో, సహజసిద్ధమైన కూరగాయల రంగులు ఉపయోగించి సంప్రదాయ ఇక్కత్ నమూనాలో చేతి మగ్గంపై నేస్తారు. చీర అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సన్నగా ఉన్నప్పటికీ, సాధారణ పట్టుచీరలాగే ధరించవచ్చు. ఒక్క చీరను పూర్తిచేయడానికి చేనేత కళాకారులకు దాదాపు ఆరు రోజుల సమయం పడుతుంది.
సిరిసిల్లకు చెందిన ప్రఖ్యాత చేనేత కళాకారులు నల్ల విజయ్ కుమార్, వెల్ది హరిప్రసాద్ ఈ అరుదైన చీరల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయ్ తండ్రి నల్ల పరంధాములు 1987లో తొలిసారిగా అగ్గిపెట్టెలో పట్టే చీరను రూపొందించి సిరిసిల్ల చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం అదే వారసత్వాన్ని విజయ్ కుమార్ విజయవంతంగా కొనసాగిస్తూ చేనేత కళకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నారు.
సిరిసిల్లలో తయారైన ఈ అగ్గిపెట్టె చీర అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాలకు ఈ ప్రత్యేక చీరను బహుమతిగా అందించడం ద్వారా సిరిసిల్ల చేనేత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శాలువాను రూపొందించి సన్మానించారు.
తన కళా నైపుణ్యాన్ని భక్తితో మేళవిస్తూ నల్ల విజయ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అమ్మవారికి, శ్రీశైలం భ్రమరాంబికా దేవికి, విజయవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే ప్రత్యేక చీరలను సమర్పించారు. దీంతో చేనేత కళతో పాటు సిరిసిల్ల సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గుర్తింపు లభించింది.
యంత్రాల యుగంలోనూ చేతి మగ్గం వైభవాన్ని సజీవంగా ఉంచుతూ, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కళాఖండాలను సృష్టిస్తున్న సిరిసిల్ల చేనేత కళాకారులు నిజంగా అభినందనీయులు. అగ్గిపెట్టెలో పట్టే చీర కేవలం ఓ వస్త్రం మాత్రమే కాదు… సిరిసిల్ల చేనేత కళాకారుల నైపుణ్యానికి, సహనానికి, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ కళను పరిరక్షించి భావితరాలకు అందించడం అవసరమని చేనేత రంగానికి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. హరిప్రసాద్ ఇటీవలనే రెండు గంటల 50 నిమిషాల్లో చీరలు తయారు చేసి అగ్గిపెట్టెలో పెట్టి రికార్డును సాధించారు. అంతేకాకుండా.. జి20 సమావేశం సందర్భంగా ఒక లోగోను కూడా మగ్గం పైన అద్భుతంగా తయారు చేశారు. ఇప్పటికీ ఇద్దరి సిరిసిల్ల కళాకారులు ఎన్నో అద్భుతాలు సాధించి చేనేత వృత్తికి వన్నెతెస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ధీమాతో చెబుతున్నారు.




