
నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీవాసి రఫీ ఇంటి సమీపంలో సుమారు పది అడుగుల పొడవు, ఇరవై కేజీలకు పైగా బరువు ఉన్న కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ కొండచిలువ మళ్లీ కనిపించడంతో వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ రజాక్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రజాక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువను అదుపులోకి తీసుకోవడం అంత సులువు కాలేదు. పట్టుకునే క్రమంలో అది చుక్కలు చూపించింది. అయినప్పటికీ రజాక్ తన చాకచక్యంతో గంటల పాటు శ్రమించి, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా దానిని సురక్షితంగా పట్టుకుని సంచిలో బంధించారు.
నల్లమల అడవుల్లోకి సురక్షితంగా విడుదల
కొండచిలువను పట్టుకున్న అనంతరం రజాక్ దానిని నంద్యాల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి తరలించి, సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. గత కొంతకాలంగా రాత్రుళ్లు సరిగ్గా నిద్ర లేకుండా భయంతో గడిపిన తమకు ఈ భారీ కొండచిలువ పట్టుబడటంతో క్రాంతినగర్ కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ను కాలనీ వాసులు అభినందించారు.