
Engineering College Fee Hikes in Telangana: చదువు అనేది భవిష్యత్తుకు బాటలు వేసే వెలుగు కావాలి గానీ, ఒక కుటుంబం ఆర్థికంగా నలిగిపోయే చీకటి కాకూడదు. విద్యే అమృతం అన్న నానుడిని పక్కనబెట్టి, నేటి ఇంజినీరింగ్ విద్యావ్యవస్థ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోవడం అత్యంత విచారకరం. మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్ప ఇంజినీర్లుగా చూడాలన్న కలలతో తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తుంటే, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం అక్షరాలను వేలం పాటగా మారుస్తూ విచ్చలవిడిగా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన ఫీజుల నిబంధనలను బొందపెట్టి, చట్టాల పగ్గాలను తెంచుకుని, ఏటా 20% నుంచి 30% అదనంగా గుంజుతున్నాయి. అయినా ఈ కార్పొరేట్ భకాసురుల ధనదాహం తీరడం లేదు.
పరిమితి లేని దోపిడీ..
విద్యార్థి భవిష్యత్తును సరిదిద్దాల్సిన కళాశాలలు.. లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, డెవలప్మెంట్ ఛార్జీలు, చివరికి ఉద్యోగ సాధన పేరుతో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజులంటూ రకరకాల రంగుల పేర్లతో వేలకు వేలు అదనంగా లాగుతున్నాయి. రవాణా, హాస్టల్ వసతుల పేరుతో పరిమితి లేని దోపిడీ సాగుతోంది. మెరిట్ ఉన్న విద్యార్థులను పక్కనబెట్టి, ప్రవేశ పరీక్షలు జరగకముందే అడ్మిషన్ల పేరుతో ప్రలోభపెడుతూ, మేనేజ్మెంట్ కోటా కింద లక్షల రూపాయల డొనేషన్లు గుంజుతున్న తీరు విద్యా వ్యవస్థకే మచ్చగా మారింది. ఇంత భారీగా ఫీజులు దండుకుంటున్నా, తీరా కళాశాలల్లో చూస్తే అరకొర జీతాలకే నడిచే అనుభవరాహిత్య అధ్యాపకులు, అధునాతన ల్యాబ్ పరికరాలు లేని గదులు, నకిలీ సర్టిఫికేషన్లు, ఉనికిలోనే లేని కంపెనీల పేరుతో నామమాత్రపు ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం శున్యం..
ఈ కార్పొరేట్ అక్రమాలపై, నిస్సహాయ తల్లిదండ్రుల ఆవేదనపై హైదరాబాద్కు చెందిన విద్యార్థి నాయకుడు దేవరాల రాకేష్ యాదవ్ మరోసారి సమరశంఖం పూరించారు. “అక్షరాన్ని అమ్ముకునే వ్యాపారులారా… విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు!” అంటూ గళమెత్తారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అక్రమాలను ఆధారాలతో సహా తీసుకెళ్లారు. పలు ఇంజినీరింగ్ కళాశాలలు చట్టవిరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సి కేసుకు ఆదేశించడం, ఏఐసీటీఈ సదరు కళాశాలలకు నోటీసులు జారీ చేయడం, అలాగే సేకరించిన అదనపు ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ కావడం దేవరాల రాకేష్ పోరాటానికి దక్కిన తొలి విజయం. కానీ.. ఈ పోరాటం ఇంకా ఫలించలేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. టీజీఈఏపీసెట్–2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది కౌన్సెలింగ్లో మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా, 75,054 సీట్లు భర్తీ అయ్యాయి. ఆగస్టు 7 చివరి తేదీ లోపు కళాశాలలను టు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 7 చివరి తేదీగా అధికారులు ఖరారు చేశారు. సమయం తక్కువగా ఉంది. ఇదే అదునుగా చూసుకుని కళాశాలలు మరోసారి రెచ్చిపోతున్నాయని దేవరాల రాకేష్ తెలిపారు. మళ్లీ అధిక ఫీజుల పర్వం మొదలైందని మరోసారి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్య వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత!
“జ్ఞానం పంచాల్సిన చోట ధనదాహం ఏలితే… విద్యార్థి మనసులో కసి కాదు, నిరాశే మిగులుతుంది.” చదువుకునే వయసులో ప్రతిభకు ప్రాధాన్యం దక్కక, ఆర్థిక భారం తట్టుకోలేక ఎందరో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి, కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, అక్రమ వసూళ్లకు పాల్పడే ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసే స్థాయి కఠిన చర్యలు చేపట్టాలి. విద్య అనేది వ్యాపారం కాదు.. అదొక సామాజిక బాధ్యత! ఆ బాధ్యతను కాపాడటానికి దేవరాల రాకేష్ లాంటి నాయకులు చేస్తున్న ఈ పోరాటం, ప్రైవేట్ యాజమాన్యాల కళ్లు తెరిపించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిజమైన న్యాయం చేకూర్చే వరకు సాగాల్సిందే.