
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య శరీర నొప్పులు, నడుము నొప్పి, తీవ్రమైన అలసట. పూర్వకాలంలో మన పెద్దలు ఇంటి వద్ద తయారుచేసే సాంప్రదాయ ఆహారాలను తిని ఎంతో బలంగా ఉండేవారు. అటువంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సాంప్రదాయ వంటకాల్లో నల్ల మినప జావ (ఉద్ది కంజి) ఒకటి.
నల్ల మినప జావతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ఎముకల బలం, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: పొట్టు తీయని నల్ల మినుములలో క్యాల్షియం, ఐరన్, భాస్వరం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ జావను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయి.
మహిళల ఆరోగ్యానికి మేలు:
మహిళలకు నల్ల మినుములు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన నడుము నొప్పి, కడుపు నొప్పుల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్ల నివారణ:
మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం అందించడంలో ఈ జావ సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన బరువు పెంపు:
చాలా సన్నగా, బలహీనంగా ఉన్నవారు ఈ జావను రోజూ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభించి, ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువు పెరుగుతుంది.
తయారీ విధానం, కావలసిన పదార్థాలు:
నల్ల మినుములు పొట్టు ఉన్నవి – 100 గ్రాములు
బియ్యం – 1/4 కప్పు
బెల్లం లేదా తాటి బెల్లం – సరిపడా
తురిమిన కొబ్బరి – 2 చెంచాలు
యాలకుల పొడి – చిటికెడు
ఉప్పు – చిటికెడు
నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష – కొద్దిగా
బాణలిలో నల్ల మినుములను వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించిన మినుములు, బియ్యం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో నీరు పోసి బెల్లం కరిగే వరకు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా జావలా కలుపుకోవాలి. మందపాటి పాత్రలో కలిపిన పిండి మిశ్రమాన్ని వేసి సన్నని మంటపై కలుపుతూ ఉడికించాలి. పిండి ఉడికిన తర్వాత అందులో బెల్లం నీరు, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యిలో వేయించిన కొబ్బరి తురుము, జీడిపప్పు, ద్రాక్ష వేసి దించుకోవాలి. వారంలో కనీసం రెండుసార్లు ఈ జావను తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, నొప్పుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.