
India vs Sri Lanka Test series 2026: శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్కు ముందు భారత జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్ రూపంలో పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్కు అత్యవసరం. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కొందరు సీనియర్ స్టార్లకు చావో రేవోగా మారింది.
సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మొదటి టెస్టు ముంగిట టీమిండియా మూడో స్థానం సమస్య తీవ్రమైంది. సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేవదత్ పడిక్కల్కు ఇది సువర్ణావకాశం. సుదీర్ఘ కాలంగా జట్టులో లోపలా బయటా ఉంటూ వస్తున్న పడిక్కల్, తన స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో పరుగులు సాధించక తప్పదు. ఒకవేళ పడిక్కల్ ఈ వార్మప్ మ్యాచ్లో విఫలమైతే మేనేజ్మెంట్ దగ్గర మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకుని, జురెల్ను మూడో స్థానంలో, పంత్ను ఐదో స్థానంలో పంపించే ఆలోచనలో బోర్డు ఉంది. అదే జరిగితే పడిక్కల్ తుది జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.
కుల్దీప్ యాదవ్కు ఆత్మపరిశీలన.. స్పిన్ విభాగంలో తీవ్ర పోటీ!
గత కొంతకాలంగా మైదానంలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ కుల్దీప్ యాదవ్ను పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు నుంచి పక్కన బెట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. లంక టెస్టు సిరీస్ కోసం భారత్ నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు మానవ్ సుతార్, సారాంశ్ జైన్ రూపంలో తీవ్ర పోటీ నెలకొంది. అక్కడి పిచ్ పరిస్థితులను బట్టి భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంక ఎ జట్టుతో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో కుల్దీప్ వికెట్లు తీసి తన సత్తా నిరూపించుకోకపోతే, మేనేజ్మెంట్ సారాంశ్ జైన్ లేదా మానవ్ సుతార్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.
యశస్వి జైస్వాల్ ఫామ్ ఆందోళన.. పరుగులు సాధించాల్సిందే!
బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ స్థానానికి ఎలాంటి ఢోకా లేకపోయినా, 2025 ప్రారంభం నుంచి అతని టెస్టు గణాంకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 11 టెస్టుల్లో 38.45 సగటుతో 769 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్, లంక సిరీస్కు ముందు తన పాత ఫామ్ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. జట్టులో ప్రత్యామ్నాయ ఓపెనర్ ఎవరూ లేకపోవడంతో, జైస్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్లోనే భారీ స్కోరు సాధించి మానసిక ధైర్యాన్ని పొందాలని యాజమాన్యం ఆశిస్తోంది. శ్రీలంక బౌలర్లను ఎదుర్కొనేందుకు అతను ఈ ప్రాక్టీస్ మ్యాచ్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!
సిరాజ్ చేతికి బౌలింగ్ బాధ్యతలు.. పేస్ దళాన్ని నడిపించేందుకు సిద్ధం!
జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో శ్రీలంక పర్యటనలో భారత పేస్ విభాగానికి మహమ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. వన్డే జట్టులో చోటు దక్కక కేవలం టెస్టులకే పరిమితమైన సిరాజ్, తను ఎంతటి ప్రమాదకర బౌలరో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. సిరాజ్ మానసిక ఆత్మవిశ్వాసంతో ఆడితేనే వికెట్లు తీయగలడు. ఈ వార్మప్ మ్యాచ్లో అతను నిరాశపరిస్తే, జట్టు మేనేజ్మెంట్ బెంచ్ మీద ఉన్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ లాంటి యువ పేసర్ల వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి సిరాజ్ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..