
Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా, బట్లర్ కేవలం 20 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడి నాటౌట్గా 51 పరుగులు చేశాడు. దీంతో అతని టీ20 కెరీర్ స్కోరు 522 మ్యాచ్ల్లో 14,833 పరుగులకు చేరింది.
ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్న అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని, అయితే రికార్డులు తుదివరకు నిలవవని బట్లర్ అన్నాడు. భవిష్యత్తులో తన ప్రపంచ రికార్డును తిరగరాసే సత్తా భారత్కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే ఉందని బట్లర్ జోస్యం చెప్పాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన వైభవ్, టీ20లలో ఇప్పటికే 40 మ్యాచ్ల్లో 1,670 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకోవడం విశేషం. ఇక, 35 ఏళ్ల జోస్ బట్లర్ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్ తరఫున 160 టీ20ల్లో 4,212 పరుగులు చేసిన అతను, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేర్వేరు ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైటాలిటీ బ్లాస్ట్లో లంకాషైర్, సమర్సెట్.. SA20లో పార్ల్ రాయల్స్, డర్బన్స్ సూపర్ జెయింట్స్.. బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్.. బీపీఎల్లో కమిల్లా విక్టోరియన్స్లకు ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి దిగ్గజ జట్లకు ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు.