
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వివాహం, లావణ్య త్రిపాఠితో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. లవ్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పెళ్లి అనేది కేవలం వయసు వచ్చిందని చేసుకునే నిర్ణయం కాదని వరుణ్ తేజ్ తెలిపారు. సరైన వ్యక్తి, మంచి అనుబంధం, ఇద్దరి మధ్య అవగాహన ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. లావణ్య త్రిపాఠిలో తనకు ఆ లక్షణాలు కనిపించాయని చెప్పారు.
“పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. సరైన వ్యక్తి అనిపించినప్పుడు, మనతో కాంపాటిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాను. లావణ్యలో నాకు ఆ విషయం కనిపించింది” అని అన్నారు. లావణ్య త్రిపాఠి తనకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని ఆయన చెప్పారు. తాను కొంత రిజర్వ్డ్గా ఉంటే, ఆమె మాత్రం చాలా బాగా మాట్లాడే వ్యక్తి అని, ఆమె సరదా స్వభావం తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. “మొదటిసారి మాట్లాడినప్పుడే ఆమె చాలా హ్యూమరస్గా, లైట్ హార్టెడ్గా అనిపించారు. సరదాగా జోక్స్ చేయడం, అందరితో కలిసిపోయే తన తీరు నాకు నచ్చింది. రోజులు గడిచేకొద్దీ ఆమె గురించి మరింత తెలుసుకున్నాను” అని అన్నారు.
తామిద్దరూ పెళ్లికి ముందు చాలా కాలం కలిసి ప్రయాణించామని వరుణ్ తేజ్ తెలిపారు. సుమారు ఏడేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్నామని, ట్రావెల్ సమయంలో కూడా లావణ్య తనకు మంచి పార్ట్నర్గా అనిపించారని అన్నారు. అలాగే లావణ్యలో తనకు నచ్చిన మరో ముఖ్యమైన విషయం ఆమె అందరినీ గౌరవించే విధానమని పేర్కొన్నారు. వ్యక్తి స్థాయి, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో ఒకే విధంగా గౌరవంగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత అని అన్నారు. లావణ్య వ్యక్తిత్వం, ఆమె పెరిగిన వాతావరణం, కుటుంబ విలువలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేసి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.