
కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పేదలకు ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నా అని, కానీ ఖజానా ఖాళీగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. బీసీల రుణం తప్పకుండా తీర్చుకుంటాం అని సీఎం పేర్కొన్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశం గర్వించే కళ చేనేత కళ అని, మన రాష్ట్రం ఇలాంటి కళలకు నిలయమని అన్నారు. మన నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారని సీఎం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘చీరాలకు రావడం నా అదృష్టం. చేనేత కుటుంబాలతో కలిసి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టాం. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం ఇస్తాం. 71,636 చేనేత కుటుంబాలకు పథకం వర్తిస్తుంది. రూ.179 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. చేనేత కార్మికులంటే నాకు ప్రత్యేక అభిమానం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేనేత కోసం పోరాడాం. చేనేత కేవలం వృత్తి కాదు.. భారతీయ సంస్కృతికి ప్రతీక. దేశం గర్వించే కళ చేనేత. చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. చీరాల పట్టు, కాటన్ చీరలకు విశేష ఆదరణ ఉంది. ఒకప్పుడు చీరాల కర్చీఫ్లు విదేశాలకు ఎగుమతి అయ్యేవి’ అని అన్నారు.
‘చేనేత రంగం కాలక్రమేణా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చేనేతను ప్రోత్సహిస్తూ జీవన ప్రమాణాలు పెంచుతాం. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, శ్రీకాకుళం, మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నా.. ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారు. వేరే పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు చేనేతలు. ఎన్నికల ముందు 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. చేనేత కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చాము. అదో కమిట్మెంట్తో చేశాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.