Reading Time: 2 minutes
Ajit Agarkars Future As Bcci Chief Selector In Doubt Amid Rohit Sharma Row

Ajit Agarkar’s Job Under Threat Over Rohit Sharma Controversy: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరో నెల రోజుల్లో అగార్కర్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ పేరు చీఫ్ సెలెక్టర్ రేసులో ముందువరసలో ఉందట.

అజిత్ అగార్కర్ పదవీకాలం వాస్తవానికి 2026 జూన్‌తో ముగియాల్సి ఉంది. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాంబ్వే వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఆ పదవీకాలాన్ని బీసీసీఐ మూడు నెలల పాటు పొడిగించింది. 2027 వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు అగార్కర్‌ పదవిలో ఉంటాడని అందరూ భావించారు. అయితే గత కొన్ని నెలలుగా టీమిండియా వన్డే జట్టులో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదాలు అగార్కర్ పదవికి ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ హిట్‌మ్యాన్‌కు చివరిదని వార్తలు వెలువడ్డాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాట్లాడిందని, రోహిత్‌ను భవిష్యత్ వన్డే సిరీస్‌ల నుంచి తప్పించే అంశంపై చర్చించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో రోహిత్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసి అందరి అంచనాలను తలకిందులు చేశాడు. కీలక సమయంలో 138 పరుగులతో చెలరేగి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ ఇన్నింగ్స్ అనంతరం రోహిత్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఈ పరిణామాల మధ్య బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చించకుండానే ఆయన ప్రకటన విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ‘రోహిత్ భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడు. జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం అతను భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. లార్డ్స్ వన్డే అతని చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా స్పష్టం చేశారు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ ఆడకూడదనే అభిప్రాయం టీమ్ మేనేజ్‌మెంట్‌లోని కొందరికి ఉన్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి.

మరోవైపు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత్ 10 మ్యాచ్‌ల్లో 8 ఓటములు చవిచూడటంపై నిర్వహించాల్సిన సమీక్షా సమావేశం ఇప్పటికీ జరగలేదు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. సమీక్షకు ముందే భారత జట్టు శ్రీలంక టెస్టు సిరీస్ కోసం బయలుదేరడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ భవిష్యత్తు, వీవీఎస్ లక్ష్మణ్‌కు చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు దక్కే అవకాశాలు, రోహిత్ శర్మపై బీసీసీఐ తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశాలపై భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.