
CJP: జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో మీడియాతో మాట్లాడిన దీప్కే, జూలై 29 నుంచి రాంచీలో జరుగుతున్న నిరవధిక ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని చెప్పారు. తాము తప్పకుండా జార్ఖండ్ వెళ్తామని, అక్కడి విద్యార్థుల ప్రతీ డిమాండ్కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
ప్రస్తుతం సీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా, ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తుందని దీప్కే వెల్లడించారు. న్యాయవ్యవస్థ, రాజకీయాలు, మీడియా, ఎన్నికల సంఘం వంటి సంస్థలపై ప్రజల విశ్వాసం తగ్గుతోందని, వీటిలో జవాబుదారీతనం తీసుకురావడమే తమ ఉద్యమ లక్ష్యమని చెప్పారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.