Reading Time: < 1 minute
Pcb Considers Two Year Ban On Mohammad Irfan And Former Players Unauthorized League

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిబంధనలను ఉల్లంఘించి అనధికారిక లీగ్‌లో పాల్గొన్నందుకు పలువురు మాజీ ఆటగాళ్లపై తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అన్-అప్రూవ్డ్ లీగ్‌లలో ఆడినందుకు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. జాంబియాలోని లుసాకాలో ఇటీవల నిర్వహించిన ‘ఏషియన్ లెజెండ్స్ లీగ్’ (ALL) లీగ్‌ను ఐసీసీ గానీ, జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) గానీ గుర్తించలేదు. జాంబియా బోర్డు మద్దతు లేని ఈ టోర్నీని అనధికారికమైనదిగా ప్రకటించారు.

ఈ క్రమంలో బోర్డు నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోకుండా ఈ లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లపై పీసీబీ చర్యలకు ఉపక్రమించింది. ఈ నిషేధం అమలులోకి వస్తే, బాధిత ఆటగాళ్లు రెండేళ్ల పాటు ఎలాంటి క్రికెట్ సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేరు. అంటే ఆడటమే కాకుండా పీసీబీ లేదా పాకిస్తాన్ సూపర్‌లీగ్ (PSL) పరిధిలోని జట్లకు కోచ్‌గా, మెంటార్‌గా లేదా ఎలాంటి సలహాదారు పాత్రల్లోనూ పనిచేయడానికి వీలుండదు. ఐసీసీ నియమ నిబంధనలను కాపాడటానికి, క్రికెట్ సమగ్రతను పరిరక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఈ టోర్నీలో ‘పాకిస్తాన్ పాంథర్స్’ అనే జట్టుతో సహా మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. జూలై 30న ప్రారంభమైన ఈ లీగ్ కోసం మహమ్మద్ హఫీజ్, సోహైల్ తన్వీర్, ఉమర్ అక్మల్ లుసాకా చేరుకున్నప్పటికీ, ఐసీసీ ఆమోదం లేదని తెలుసుకుని చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నారు. అయితే మహమ్మద్ ఇర్ఫాన్, ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్, రాహత్ అలీ, యాసిర్ షా, జాహిద్ మహమూద్, హసన్ రజా, ఇబ్రార్ హుస్సేన్‌లు జూలై 31న ఒక మ్యాచ్ ఆడారు. ఈ లీగ్‌లో ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు కూడా పాల్గొన్నప్పటికీ.. కేవలం పీసీబీ మాత్రమే తన ఆటగాళ్లపై బహిరంగంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.