అసలే వర్షాకాలం.. కానీ చినుకు మేఘం నుంచి చినుకు చుక్క రాలడం లేదు.. రైతన్న దిగాలుగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నాడు.. కానీ వరుణ దేవుడు కరుణించిందే లేదు. దీంతో ఇక అనావృష్టి పోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని సింహాచలంలో వరుణ జప యాగం నిర్వహిస్తున్నారు. శాస్త్రంగా పూజలు ప్రారంభించారు.
సింహాచలంలోని శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో ‘వరుణ జప యాగం ’ గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని, అనావృష్టి పరిస్థితులు తొలగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ పూజలు ప్రారంభించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఆధ్యాత్మిక క్రతువు వేద మంత్రోచ్ఛారణల నడుమ శోభాయమానంగా మొదలైంది.దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు-దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను ప్రారంభించారు.
విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.
లోక కల్యాణార్థం చేపట్టిన ఈ యాగంతో రైతాంగ సంక్షేమం, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా సింహగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వాహణాధికారి కే. తిరుమలేశ్వరరావు, ఆలయ పండితులు, భక్తులు పాల్గొన్నారు.




