Reading Time: < 1 minute
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సముద్రంలో కలకలం రేగింది. నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారంతో పోలీసులు పరుగులు తీశారు. మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ళ సాయాన్ని తీసుకున్నారు. అతి కష్టం మీద సముద్రంలో చిక్కుకున్న వాళ్లను తీరానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ నిపుణులు సముద్రంలో ఎందుకు వెళ్లారు..? అక్కడ ఏం జరిగింది..?

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ కోసం నిపుణుల బృందం వెళ్ళింది. వైజాగ్ పోర్ట్ నుంచి బుధవారం నాడు బయలుదేరి సముద్రంలో పరీక్షలు చేసుకుంటూ బార్జ్ వెళ్తున్నారు. అవసరమైన చోట ఆగి పరీక్షలు చేస్తున్నారు. బార్జ్ అంటే.. చదునైన అడుగు భాగం కలిగి ఉండే ఒక పెద్ద, దీర్ఘచతురస్రాకారపు పడవ లేదా నౌక. దీనికి స్వంతంగా ఇంజిన్ లేదా ప్రొపల్షన్ ఉండదు. దీనిని భారీ వస్తువులు, సరుకులను రవాణా చేయడానికి టగ్ బోట్‌ల సహాయంతో లాగుతారు.

సాయిల్ టెస్ట్ కోసం భారీ యంత్రాలతో బార్జ్‌ను మూడు పడవల సాయంతో లాక్కుంటూ వెళ్తున్నారు. పూడిమడక తీరంలో పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో సముద్ర అలల తాకిడి పెరిగింది. దీంతో ఆ బార్జ్‌కు అనుసంధానమై ఉన్న బోట్ల తాళ్లు తెగిపోయాయి. బోట్లు, బార్జ్ వేరేయ్యాయి. అలల తాకిడి మరింత పెరగడంతో ఆ బోట్లు అక్కడ నిలవలేకపోయాయి. సముద్ర అలలపైనే బార్జ్ ఉండిపోయింది. అందులో నలుగురు నిపుణులు చిక్కుకున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులకు సమాచారం అందడంతో అందరూ అప్రమత్తమయ్యారు. నేవీ కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం వెళ్ళింది. రాత్రికి రాత్రి ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయాన్ని తీసుకున్నారు. సముద్రంలో చిక్కుకున్న నలుగురు సాయిల్ టెస్ట్ నిపుణులను మత్స్యకారులు సాయంతో పూడిమడక మెరైన్ పోలీసులు రక్షించారు. తంతడి సమీపంలో ఉన్న బార్కు కోసం జెట్టి నిర్మించడానికి అవసరమైన సాయిల్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సముద్రంలో చిక్కుకున్న నలుగురు నిపుణులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు.

వీడియో చూడండి..