
మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం వల్ల ఓ వైద్యురాలి జీవితం అంధకారంలో పడింది. నిందితుల నిర్లక్ష్యం, కక్ష సాధింపు ధోరణి కారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని యువకులు కారుతో ఢీ కొట్టారు. బుధవారం రాత్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మెడికోకు చికిత్స కొనసాగుతోంది.
ముందు మాల్ గొడవ..
రాజమండ్రిలోని నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి సినిమా కోసం ప్రసాద్ ఆదిత్య మాల్కు వెళ్లగా.. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఫోన్లు తీసుకుని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అతివేగంగా కారు నడుపుతుండగా.. పక్కన ఉన్న వ్యక్తి వారించినా వినకుండా రెచ్చిపోయాడు. భయంతో పక్క వ్యక్తి కారు నుంచి దూకేయగా, డ్రైవింగ్ చేస్తున్న యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వైద్య విద్యార్థినిపైకి కారును దూసుకెళ్లాడు. కిందపడిన ఆమెపై నుంచే కనికరం లేకుండా కారు పోనిచ్చాడు. బాధితురాలిని స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో బ్రెయిన్డెడ్ కండిషన్లో ఉంది. ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని జీవితం అంధకారంలో పడిందంటూ యువతీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువకులు ఇద్దరినీ కఠినంగా శిక్షించాలం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.