Reading Time: < 1 minute
Iran President Masoud Pezeshkian Says Contacting Supreme Leader Mojtaba Khamenei Is Difficult

Iran: ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు ఆ దేశ సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం నేరుగా సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా మారిందని అన్నారు. అయితే, దేశానికి ఆయన నాయకత్వం ఇప్పటికీ గొప్ప బలమని కొనియాడారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే సమయంలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలు కావడం వల్ల చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన తన తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు.

అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మొజ్తబా ఖమేనీతో నేరుగా మాట్లాడటం కష్టమని, అయినప్పటికీ ఆయన ఉనికి తమకు గొప్ప బలాన్ని ఇస్తోందని, అదే మాకు ముందుకు సాగేందుకు ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. ఆయన బహిరంగంగా కనిపించకపోయినా, లిఖితపూర్వక ప్రకటనల ద్వారా ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేస్తున్నారని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. గతంలో తనకు మొజ్తబా ఖమేనికి మధ్య సమావేశాలు ఎంతో సానుకూలంగా జరిగాయని చెప్పారు. ప్రస్తుతం కొందరు కావాలనే ఆయనపై భిన్నమైన అభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు, ఇరాన్ అత్యున్నత అధికారంలో విభేదాలు ఉన్నాయని పలు వార్తా నివేదికలు వెలువడుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, సుప్రీం లీడర్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని నివేదించాయి. భద్రతా వ్యవహారాలు, అణు చర్చల వంటి కీలక నిర్ణయాల్లో సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ అహ్మద్ వహీదీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. పెజెష్కియాన్ పలు సందర్భాల్లో రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు, ఈసారి అలాంటి ప్రయత్నాలను అడ్డుకోబోమనే సంకేతాలను సుప్రీంలీడర్ ఇచ్చినట్లు ఇజ్రాయిల్ మీడియా నివేదించింది.