
India vs Sri Lanka Practice Match Rishabh Pant Brain Fade Moment: శ్రీలంక ఎలెవెన్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర తప్పిదంతో విమర్శలు పాలయ్యాడు. చేతిలో బంతి లేకుండానే వికెట్లను గిరాటేసి రన్ అవుట్ అవకాశాన్ని చేజార్చుకోగా, స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ మెరుపు వేగంతో స్పందించి వికెట్లను పడగొట్టి భారత్కు ఉపశమనం అందించాడు.
కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంక ఎలెవెన్తో భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ పోరును ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఓపెనర్లు రవిందు రసంత, నిషాన్ మదుష్క అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. భారత పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు పిండుకున్నారు. మదుష్క కేవలం 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుని, 65 బంతుల్లో 66 పరుగులు సాధించి క్రీజులో పాతుకుపోయాడు. మొదటి సెషన్ ముగిసేసరికి లంక జట్టు వికెట్ నష్టపోకుండా 138 పరుగులు చేసి బలమైన స్థితిలో నిలిచింది. ఇక ప్రస్తుతం వార్త రాసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
ఒకే వైపు ఇద్దరు బ్యాటర్లు.. డ్రామాగా మారిన రన్ అవుట్..
భారత్ తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో 20వ ఓవర్ నాలుగో బంతికి అనూహ్యమైన మలుపు తిరిగింది. నిషాన్ మదుష్క ఎక్స్ట్రా కవర్ వైపు బంతిని నెట్టి సింగిల్ కోసం పరిగెత్తారు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న రసంత స్పందించకపోవడంతో ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు వచ్చేశారు. కవర్స్ నుంచి యశస్వి జైస్వాల్ అందించిన త్రోను మానవ్ సుతార్ అందుకని కీపర్ వైపు విసిరారు. బంతి పంత్ తలకు పైనుంచి వెళ్లగా, ఆవేశంలో పంత్ బంతి చేతికి చిక్కకముందే వికెట్లను గిరాటేశారు. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి చేతిలో లేకుండా స్టంప్స్ పడగొడితే అది రన్ అవుట్ కిందకు రాదు.
కెఎల్ రాహుల్ సమయస్ఫూర్తి.. లభించిన తొలి వికెట్..
— crictalk (@crictalk7) August 7, 2026
పంత్ చేసిన తీవ్రమైన తప్పుతో లంక బ్యాటర్ బతికిపోయాడని అందరూ భావించారు. ఆ సమయంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించారు. పంత్ వెనక్కి వెళ్లిన బంతిని పట్టుకుని, వెంటనే వికెట్ల వద్దకు వచ్చి బంతితో కూడిన చేతితో స్టంప్స్ను తాకించారు. దీంతో మదుష్క రన్ అవుట్ ముగిసింది. కీపర్ పంత్ చిన్నపిల్లల తరహాలో చేసిన పొరపాటును రాహుల్ తన తెలివితో సరిదిద్దడంతో భారత క్యాంప్ ఊపిరి పీల్చుకుంది.
గాయం కారణంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదటి రోజు ఆట నుంచి దూరమవడంతో రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం అందకపోవడం, లంక బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు సాధించడంతో భారత్ ఒత్తిడిలో పడింది. పంత్ కాస్త శ్రద్ధ వహించి ఉంటే ఇంతటి డ్రామా లేకుండానే వికెట్ దక్కేది. ఈ డ్రామాకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారమవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..