
క్రికెట్ మైదానానికి వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా విడుదలైన క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ 2025 నివేదికలో సచిన్ సరికొత్త సంచలనం సృష్టించారు. 125.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,189 కోట్లు) బ్రాండ్ విలువతో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన టాప్ 5 సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా నిలిచారు. ఆట నుంచి తప్పుకున్నప్పటికీ, ఏటా తన బ్రాండ్ విలువను పెంచుకుంటూ టాప్ 10లో నిలకడగా కొనసాగుతున్న ఏకైక రిటైర్డ్ ప్లేయర్గా సచిన్ రికార్డు సృష్టించారు. ఆయనకున్న విశ్వసనీయత, ప్రామాణికతే బ్రాండ్లను ఇప్పటికీ తనవైపు ఆకర్షిస్తున్నాయి.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్
క్రికెట్ ప్రపంచం చూసిన అత్యంత సంపూర్ణమైన బ్యాటర్, రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 34,357 పరుగులు సాధించి, ఆల్ టైమ్ మోస్ట్ ప్రోలిఫిక్ బ్యాటర్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ అత్యధిక శతకాలు బాదిన రికార్డు ఆయన పేరిటే ఉంది. విచిత్రమేమిటంటే.. తన కెరీర్లో 79వ వన్డే మ్యాచ్ వరకు సచిన్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. కానీ ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు సెంచరీల వర్షం కురిపించి ఎవరికీ సాధ్యంకాని మైలురాళ్లను నెలకొల్పారు.
టెస్ట్ క్రికెట్లో అజేయమైన రికార్డులు
తన అసమానమైన సహనం, పట్టుదలతో మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్లో ఎన్నో సువర్ణాక్షరాలను లిఖించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 200 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించారు. రెడ్ బాల్ క్రికెట్లో అత్యధికంగా 15,921 పరుగులు, 51 సెంచరీలు, 2,058 ఫోర్లు బాది అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాకుండా కేవలం 300 ఇన్నింగ్స్ల్లోనే అత్యంత వేగంగా 15,000 టెస్ట్ పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక బ్యాటర్గా సచిన్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
వన్డేల్లో సుదీర్ఘ ప్రయాణం.. చెరిగిపోని ఘనతలు
వన్డే ఫార్మాట్లో ఏకంగా 22 సంవత్సరాల 91 రోజుల పాటు సుదీర్ఘ కెరీర్ను సాగించిన ఘనత సచిన్ది. 1998వ ఒక్క సంవత్సరంలోనే వన్డేల్లో 1,894 పరుగులు, 9 సెంచరీలు బాది, ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా 145 అర్ధశతకాలు సాధించడమే కాకుండా రికార్డు స్థాయిలో 2,016 ఫోర్లు బాది ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు.
మారని సచిన్ మేనియా
వన్డేల్లో అత్యంత వేగంగా 18,000 పరుగుల మైలురాయిని కేవలం 440 ఇన్నింగ్స్ల్లోనే అందుకుని అప్పట్లోనే రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మైదానాల్లో ఎన్ని తరాలు మారినా, ఎందరో కొత్త ఆటగాళ్లు వచ్చినా.. మైదానంలోనూ, వ్యాపార ప్రపంచంలోనూ సచిన్ టెండూల్కర్ పేరు ఒక బ్రాండ్గా, భరోసాగా మారిపోయింది. అందుకే భారత అభిమానులు ఆయనను ఇప్పటికీ గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకుంటారు.