Reading Time: < 1 minute
Telangana Fake Certificate Scam Inter Board Show Cause 37 Jls

రేయింబవళ్లు కష్టపడి, పుస్తకాలతో కుస్తీ పట్టి, అన్ని అర్హతలూ ఉండి కూడా ఉద్యోగం రాక లక్షలాది మంది నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న అర్హులైన అభ్యర్థుల జీవితాలతో ఫేక్ కేటగిరీ గాళ్లు చెలగాటమాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ, అర్హత ఉన్న నిజమైన నిరుద్యోగుల పొట్టకొడుతున్నారు. కష్టపడి చదివిన వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి, అక్రమార్కులు పబ్బం గడుపుకోవడం సమాజానికి తీరని చేటు చేస్తోంది.

ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన 37 మందికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ నోటీసులకు తగిన వివరణ ఇవ్వాలని, వారు ఇచ్చే సమాధానాల ఆధారంగానే తదుపరి కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. గతంలో కూడా ఇటువంటి నకిలీ సర్టిఫికెట్లతో దొరికిన 15 మందికి పైగా సిబ్బందిని ఇంటర్ బోర్డు ఇప్పటికే ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేసింది.

మరోవైపు.. ఆర్థిక శాఖ పరిధిలోని ఐఎఫ్‌ఎమ్‌ఐఎస్ (IFMIS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్, ఉద్యోగ వివరాల ధృవీకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టి ఒకే ఆధార్ ఆధారంగా రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థల నుంచి అక్రమంగా జీతాలు పొందుతున్న మోసాలను అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దాదాపు 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఒకే సమయంలో రెండు శాఖల నుంచి రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి.

ఇలాంటి డూప్లికేట్ మ్యాపింగ్‌లపై ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్రమంగా జీతాలు పొందిన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అన్ని శాఖలు తక్షణమే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఈ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.