
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో 9వ సీడ్ దక్కింది. మెన్స్ డబుల్స్ విభాగంలో స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఐదో సీడ్గా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఈ నెల 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది.
ఈ టోర్నీలో మొత్తం ఐదు విభాగాల్లోనూ ఇండియా నుంచి రెండేసి ఎంట్రీలు దక్కగా, నాలుగు విభాగాలలో కనీసం ఒక్కో సీడెడ్ స్థానం లభించింది. సింధు, సాత్విక్–-చిరాగ్ జోడీతో పాటు మెన్స్ సింగిల్స్లో మాజీ వరల్డ్ చాంపియన్షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ లక్ష్య సేన్ 14వ సీడ్గా, మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–-తనీషా క్రాస్టో జోడీ 15వ సీడ్గా నిలిచారు. ఏప్రిల్ 28 నాటి ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆటగాళ్లు అర్హత సాధించగా, జులై 28 నాటి ర్యాంకింగ్స్ ప్రాతిపదికన సీడింగ్లను ఖరారు చేశారు. మెన్స్లో షీ యుకి (చైనా), విమెన్స్లో ఆన్ సె యంగ్ (సౌత్ కొరియా) టాప్ సీడింగ్ కేటాయించారు. జపాన్ స్టార్ అకానె యమగుచి రెండో సీడ్గా నిలవగా, చైనా ఆటగాళ్లు వాంగ్ జి యీ, చెన్ యుఫే మూడు, నాలుగు స్థానాలు సాధించారు. బుధవారం టోర్నీ డ్రా ప్రక్రియ జరగనుంది. సీడెడ్ ఆటగాళ్లలో ఎవరైనా చివరి నిమిషంలో వైదొలిగితే తుది సీడింగ్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది.