
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన భారీ ఫోర్జరీ బాగోతంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రా చీఫ్ ఎవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఏకంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీ (Fire NOC) సర్టిఫికెట్లను సృష్టించిన ఆ ఎనిమిది ప్రైవేట్ కాలేజీల జాబితా బయటపడింది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, హైడ్రా పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించిన ఆ కాలేజీలు… మెహిదీపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయణగుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్.
అలాగే శివరంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ట జూనియర్ కాలేజ్, బరకత్పురాలోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ యాజమాన్యాలు కూడా ఈ ఫోర్జరీ దందా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అధికారుల తనిఖీల్లో ఈ మోసం బట్టబయలు కావడంతో… ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా… నకిలీ పత్రాలు ఎక్కడ తయారయ్యాయి, వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు.