
Mahabubabad: పూర్వకాలంలో సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే పోరాడి, తన పాతివ్రత్య మహిమతో, చాతుర్యంతో భర్త ప్రాణాలను దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ పవిత్రమైన దాంపత్య బంధానికి అర్థం లేకుండా పోతోంది. భార్యాభర్తల బంధంలో విశ్వాసానికి బదులు వంచన, ప్రేమకు బదులు స్వార్థం రాజ్యమేలుతున్నాయి. సతీ సావిత్రి కథకు పూర్తి విరుద్ధంగా, కట్టుకున్న భర్త ప్రాణాలను కాపాడాల్సింది పోయి, ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చడానికి ప్లాన్లు వేసిన దారుణ సంఘటనలు సమాజంలో నిత్యం వెలుగు చూస్తున్నాయి.
అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసి తీవ్ర కలకలం రేపింది. డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్ నగర్లో నివాసముంటున్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన యువతితో అతనికి వివాహం కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జూలై నెల 27వ తేదీన భోజనం కోసం ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు తన అన్నను తీసుకురావడానికి వెళ్లిన సమయంలో అనుమానితుడు తనను వెంబడించినట్లు తెలిపాడు. అనంతరం భార్య మొబైల్ ఫోన్ను పరిశీలించగా ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటపడినట్లు పేర్కొన్నాడు. భర్తను ఎలాగైనా హత్య చేయించాలని భార్య ప్రియుడితో చేసిన ఛాటింగ్లో కనిపించింది. రోడ్డు ప్రమాదం చేయించి చంపేయాలని భార్య కుట్ర పన్నింది. ఈ విషయంలో ప్రియుడిపై ఒత్తిడి చేసినట్లు మెసేజ్లలో కనిపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ భార్యతో పాటు ఆమె ప్రియుడు పురిమెట్ల సైదులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ భర్త ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా డోర్నకల్లు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అనంతరం బాధితుడు అక్కడ కూడా మరోసారి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిందని, చట్టపరమైన విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని గ్రామీణ పోలీసులు తెలిపారు. కేసులో సమర్పించిన డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.