Reading Time: < 1 minute
India Sheikh Hasina Media Remarks Mea Response

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న నిర్వహించిన మీడియా సమావేశం, ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్లబోతున్నట్లు ప్రకటించడంతో పాటు మహ్మద్ యూనస్ పాలన, తనను పదవి నుంచి కిందకు దించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, న్యూఢిల్లీ నుంచి హసీనా చేసిన ఈ ప్రసంగంపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఈ అంశం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని బంగ్లా వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. షేక్ హసీనా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యల్ని భారత్ సమర్థించడం లేదని తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షేక్ హసీనా పాల్గొన్న కార్యక్రమం పూర్తిగా ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని చెప్పారు.

2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల తర్వాత హసీనా బంగ్లా నుంచి భారత్ వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఏడాది చివర్లో తాను తన సొంత దేశానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. జైలు శిక్ష లేదా మరణశిక్ష ఎదురైనా ప్రజల కోసం స్వదేశానికి వెళ్తానని ఆమె చెప్పారు. తన లక్ష్యం మళ్లీ అధికారంలోకి రావడం కాదని, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, అభివృద్ధి పునరుద్ధరించడమే అని చెప్పారు. అవామీలీగ్‌పై నిషేధం ఎత్తాయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, తప్పుడు కేసులను విత్ డ్రా చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లా పరిస్థితి మరో పాకిస్తాన్‌లా మారిందని హసీనా కుమారుడు అన్నారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం ఒక కుట్ర అని, పాలన మార్చాలని కుట్ర పన్నారని హసీనా ఆరోపించారు.