Reading Time: < 1 minute
Veligonda Project Krishna Water To Reach Nallamala Sagar This Month Says Minister Nimmala

Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, ఈ నెల మూడో వారంలోనే నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కొల్లం వాగు నుంచి టన్నెల్స్ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన అప్రోచ్ ఛానెల్ క్లియరింగ్ పూర్తైందన్నారు. రెండు టన్నెల్స్‌లో మిగిలిన 286 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, టన్నెల్-2లో చిక్కుకుపోయిన టిబిఎం (TBM) యంత్రాన్ని తొలగించే ప్రక్రియ కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. 1,900 మెట్రిక్ టన్నుల బరువున్న టిబిఎం యంత్రంలో ఇప్పటికే 1,300 మెట్రిక్ టన్నులను వెలికితీసినట్లు, మిగిలిన 600 మెట్రిక్ టన్నులను కూడా 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని వెల్లడించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి, ఐదేళ్లలో టిబిఎం యంత్రాన్ని తొలగించలేకపోయారని, చుక్క నీరు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని ప్రచారం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ.450 కోట్లతో ఫీడర్ కెనాల్‌లో కేవలం ఆరు నెలల్లోనే 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించి, 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసిందన్నారు. నిర్వాసితుల పునరావాసంపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,560 కుటుంబాలకు రూ.318 కోట్లు అందజేశామని చెప్పారు. ఈ వారం మరో 2,863 కుటుంబాలకు రూ.353 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. మిగిలిన 1,898 కుటుంబాలకు ఈ నెలాఖరులోగా రూ.210 కోట్లు చెల్లించి ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.