Reading Time: 2 minutes
Harish Rao Grmb Telangana Project Approvals Sammakka Sagar

Harish Rao: ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు లభించిన తర్వాత వాటిని సమీక్షించి రద్దు చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో సాధించిన తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే దిశగా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) అజెండా రూపొందుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఒక ఉద్యమకారుడిగా ఈ పరిణామాలను చూస్తుంటే తనకు కడుపు రగులుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 25న ఎంతో కష్టపడి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఉరి వేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరగా, తెలంగాణ ప్రభుత్వం దానికి అంగీకరించిందన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నీళ్లు వాస్తవానికి ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్‌కు వెళ్తాయని, అయినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము ఈ అంశాన్ని లేవనెత్తిన రెండు రోజులకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఏడు అనుమతులను రివ్యూ చేస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ బీజేపీ నేతలు ఏమాత్రం స్పందించకపోవడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భయపడి కేంద్ర మంత్రులు పెదవులు మూసుకుంటున్నారని, దీనిపై బీజేపీ వెంటనే స్పందించకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం చంద్రబాబు బంటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే జీఆర్ఎంబీ అజెండాలో ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, ఒకవేళ కేసీఆర్ సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లేదా కేంద్రానికి ఇంత ధైర్యం వచ్చేదా అని ప్రశ్నించారు. ఏపీ మూలాలు ఉన్న అధికారులు తెలంగాణ ఇరిగేషన్ శాఖలో బాధ్యతలు వహిస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించారు. జీఆర్ఎంబీ సమావేశ అజెండా నుంచి గోదావరి, బనకచర్ల అంశాలను తొలగించాలని, ఈ అజెండాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్‌లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు గళం విప్పాలని కోరారు. ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వం రిట్, సూట్ పిటిషన్ల పేరుతో ఏడాది కాలంగా సమయం వృథా చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందాలతో గోదావరి, బనకచర్ల ప్రాజెక్టులకు ఒప్పుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు చట్టబద్ధంగా 960 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ, రాష్ట్ర హక్కులు కాలరాస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ బొమ్మలాగా కూర్చున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.