Reading Time: < 1 minute
Vijaya Dairy Chairman Election Sparks Tension In Tdp

విజయవాడలో విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. పార్టీ సూచనలను పక్కనపెట్టి డైరెక్టర్ పదవికి నామినేషన్ వేసి.. అనంతరం ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికైన చలసాని ఆంజనేయులు వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో విజయ డెయిరీ ఎపిసోడ్‌లో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చలసాని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయ డెయిరీ డైరెక్టర్‌గా నామినేషన్ వేయొద్దని పార్టీ పెద్దలు సూచించినప్పటికీ.. చలసాని ఆంజనేయులు నామినేషన్ వేసి, ఆపై చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఆయన వ్యవహరించడంపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చైర్మన్‌గా రాజీనామా చేయాలని మంత్రులు సారధి, కొల్లు రవీంద్ర చలసానిపై ఒత్తిడి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన అంశాన్ని టీడీపీ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల మధ్య చలసాని ఆస్పత్రిలో చేరడంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత కొన్నేళ్లుగా చలసాని ఆంజనేయులుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. విజయ డెయిరీ వ్యవహారంలోనూ వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా చలసాని చైర్మన్‌గా ఎన్నిక కావడం, పార్టీ అధిష్ఠానం నుంచి రాజీనామా చేయాలనే ఒత్తిడి వచ్చినట్లు ప్రచారం జరగడం నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చైర్మన్ పదవికి ఎన్నికైన వెంటనే తలెత్తిన ఈ పరిణామాలతో విజయ డెయిరీ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చలసాని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో పార్టీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?, చైర్మన్ పదవిపై ఏం జరుగుతుంది? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.