Reading Time: < 1 minute
Bnp Mp Awami League Merger Sheikh Hasina Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తానని ప్రకటించింది. 2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత ఆమె బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో వేసినా, చంపేసినా కూడా తన ప్రజల వద్దు వెళ్తానని స్పష్టం చేసింది. తాను అధికారం కోసం వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం వెళ్తున్నానని చెప్పారు. తన పార్టీ అవామీలీగ్‌పై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

షేక్ హసీనా వ్యాఖ్యలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇదిలా ఉంటే, ఆ దేశంలో మరో కొత్త చర్చ మొదలైంది. బీఎన్పీకి చెందిన ఎంపీ నాసిర్ ఉద్దీన్ చౌధురి మాట్లాడుతూ.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తమకు శత్రువు కాదని, మిత్రపక్షమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవామీ లీగ్ బీఎన్పీలో విలీనం కావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 1971 విమోచన యుద్ధంలో బీఎన్పీ, అవామీలీగ్ కలిసి పోరాడాయని గుర్తు చేశారు. అవామీలీగ్‌ను శత్రువుగా చూడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో రెండు పార్టీల విలీనం కూడా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.

అయితే, నాసిర్ ఉద్దీన్ వ్యాఖ్యలపై బీఎన్పీ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మరోవైపు షేక్ హసీనాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఎన్పీ సీనియర్ నేత రుహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ.. జూలై ఉద్యమంలో మరణించిన వారిని అవమానించేలా భారత్ ఈ సమావేశాన్ని నిర్వహించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. భారత భూభాగాన్ని ఉపయోగించి తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం జరిగిందని విమర్శించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు హఫీజ్ అహ్మద్ హసీనాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆమె తిరిగి రావచ్చు, అయితే ప్రజల మధ్యే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.