Reading Time: < 1 minute
Revanth Reddy Orders Transparent Conduct Of Telangana Police Recruitment Exams

CM Revanth Reddy: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి నిఘా వర్గాలు అందించిన కీలక సమాచారంపై సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత శక్తులు నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించడంతో, డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ సూచించారు. నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఎలాంటి లోపాలకు అవకాశం ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా దుష్ప్రచారం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని, పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..