
ఉప్పల్, వెలుగు: స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ రామంతపూర్లోని ప్రభుత్వ ఆయుష్ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్లు, పీజీ మెడికల్ స్టూడెంట్లు మంగళవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమకు న్యాయమైన స్టైఫండ్ అందడం లేదన్నారు. పదేళ్లుగా స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ మెడికల్ స్టూడెంట్లకు చెల్లిస్తున్న స్టైఫండ్ అత్యల్పంగా ఉందని పేర్కొన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిలిచిన వైద్య సేవలు..
పంజాగుట్ట, వెలుగు: ఎర్రగడ్డ, బల్కంపేట యునాని ఆస్పత్రులతో పాటు రామాంతపూర్, చార్మినార్, నేచర్ క్యూర్ కేంద్రాల్లో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు విధులకు దూరంగా ఉండి ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రుల్లో ఓపీ సేవలు మాత్రమే కొనసాగగా, ఇతర వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారు.