
హైదరాబాద్సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 4,121 మంది ప్రయాణికుల నుంచి రూ.30.53 లక్షల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జోన్ పరిధిలోని 169 రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో టికెట్ లేని ప్రయాణికులు, అనధికారికంగా ప్రయాణించేవారు, బుక్ చేయని లగేజీ తీసుకెళ్లేవారిపై ప్రధానంగా దృష్టి సారించారు. రైళ్లలో చెత్త వేయడంతో 35 మంది ప్రయాణికుల నుంచి రూ.7,300 జరిమానా వసూలు చేశారు.
రైల్వే ప్రాంగణంలో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహించిన 19 మందికి రూ.38 వేల జరిమానా విధించగా, ధూమపానం చేసిన ఇద్దరికి రూ.4 వేల జరిమానా విధించారు. ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులను రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.