తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త రూపంలో ప్రయాణికులకు దర్శనమివ్వనుంది. ప్రతిరోజూ దాదాపు 180కి పైగా రైళ్ల రాకపోకలు, సగటున 1.5 లక్షల మంది ప్రయాణికుల రద్దీతో నిత్యం కోలాహలంగా ఉండే ఈ స్టేషన్ను విమానాశ్రయం తరహాలో అత్యాధునిక ప్రపంచ స్థాయి వసతులతో తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రీ-డెవలప్మెంట్ ప్రాజెక్టును దాదాపు రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో వేగవంతం చేశారు. ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ పనులు 65 శాతం వరకు పూర్తి కావడం విశేషం.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నూతన స్టేషన్లో బహుళ ప్రయోజనకరమైన మౌలిక వసతులను నిర్మిస్తున్నారు. ప్రధానంగా ప్రయాణికులు వేచి ఉండేందుకు రెండు అంతస్తుల విశాలమైన ఎయిర్ కాంకోర్స్, ప్లాట్ఫారమ్లపై ఆధునిక రూఫ్ టాప్లు, మల్టీ-లెవెల్ పార్కింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, సాధారణ ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేసేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, ట్రావలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
దీనికి తోడు మెట్రో ప్రయాణికులకు నేరుగా రైల్వే స్టేషన్తో అనుసంధానం కల్పించేలా ప్రత్యేక స్కైవాక్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (STP) కూడా ఇందులో భాగం చేశారు. ప్రాజెక్టు పురోగతిలో భాగంగా ఇప్పటికే దక్షిణ వైపున నిర్మించాల్సిన ప్రధాన పనులు తుది దశకు చేరుకున్నాయి. తాత్కాలిక బుకింగ్ ఆఫీస్, ఆర్పీఎఫ్ (RPF) భవనం, కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సౌత్ స్టేషన్ భవనం, సౌత్ అరైవల్ ఏరియా, బేస్మెంట్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
ప్రస్తుతం ఉత్తర వైపు బహుళ అంతస్తుల పార్కింగ్ భవనం, నార్త్ స్టేషన్ మెయిన్ బిల్డింగ్, ఎయిర్ కాంకోర్స్ ఫ్రేమ్వర్క్, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం అత్యంత ఆధునిక సీసీటీవీ సర్వేలెన్స్, AI ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంద ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి X వేదికగా పేర్కొన్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ మోడల్ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు ప్రయాణ అనుభూతి పూర్తిగా మారిపోనుంది.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా మెట్రో, బస్సు, రైలు మార్గాల మధ్య ప్రయాణికులు సులభంగా మారేలా Inter-modal Connectivity ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. పనులు శరవేగంగా జరుగుతుండటంతో అతి త్వరలోనే ఈ మోడల్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.





