
కూకట్ పల్లిలోని రంగధాముని చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. బతుకమ్మ కుంట మాదిరిగా వినాయక చవితి, బతుకమ్మ పండుగలకు నిమజ్జనం జరిగేలా.. స్థానికులకు నిత్యం వాకింగ్ చేసుకునేలా, ఫ్యామిలీతో కలిసి ఉల్లాసంగా గడిపేలా ముస్తాబు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. చెరువు అభివృద్ధిపై 2026 ఆగస్టు 5వ తేదీన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు.
చెరువు అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. రాబోయే బతుకమ్మ, వినాయక చవితి పండుగల సందర్భంగా రంగధాముని చెరువు వద్ద పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు, వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగనున్న క్రమంలో.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్కు సూచించారు.
అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువు పరిసర ప్రాంతంలో సుమారు పది ఎకరాల స్థలాన్ని వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖలకు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రాంతంలో నివాస ప్రాంతాలు అధికంగా ఉన్నందున భవిష్యత్తులో మౌలిక వసతుల కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, పోలీసు అధికారులు, హైడ్రా అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.