
Plastic Currency Notes: భారతదేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపగా, బుధవారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు.
2028 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విడుదల లక్ష్యం
ఎంపీసీ సమావేశ ఫలితాలను ప్రకటించిన అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. 2028 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడమే ఆర్బీఐ లక్ష్యమని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సన్నాహాలు కొనసాగుతున్నాయని, మార్కెట్లోకి విడుదలకు ముందు పైలట్ ప్రాజెక్ట్ ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆమోదం.. భారీ స్థాయిలో ఫీల్డ్ ట్రయల్స్
ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం, రూ.10, రూ.20 విలువ కలిగిన 100 కోట్ల (ఒక బిలియన్) పాలిమర్ నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే దశలవారీగా ఈ నోట్లను క్రమం తప్పకుండా చలామణిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుత కాగితపు నోట్ల పరిస్థితి ఏంటి?
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయనే కారణంగా ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు నోట్లను నిలిపివేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పాలిమర్ నోట్లు, ఇప్పటికే ఉన్న కాగితపు నోట్లతో పాటు చలామణిలో కొనసాగుతాయి. ప్రస్తుతం కాగితపు కరెన్సీని పూర్తిగా పాలిమర్ నోట్లతో భర్తీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం వెల్లడించింది.
పాలిమర్ నోట్ల ప్రత్యేకతలు
పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు, దుమ్ము, చిరిగిపోవడం వంటి సమస్యలకు ఇవి తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అంతేకాకుండా, వీటిని నకిలీ చేయడం కూడా చాలా కష్టం. ప్లాస్టిక్ నోట్లను క్రమం తప్పకుండా చలామణిలోకి తీసుకువచ్చిన తర్వాత డిజిటల్ చెల్లింపులపై వాటి ప్రభావాన్ని కూడా ఆర్బీఐ పరిశీలించనుంది.
ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వాడకం
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రపంచానికి కొత్తవి కావు. 1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలు ఈ నోట్లను ఉపయోగిస్తున్నాయి. భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుండటంతో దేశంలో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టినట్లైంది.