Reading Time: < 1 minute
Aasara Pensions Release August 15 Minister Ponguleti Srinivas Reddy Khammam

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ గుదిమళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి నెలకు నిర్ణీత ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పథకం ద్వారా వృద్ధులు, విధవలు, నేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 2,016 చొప్పున పింఛను అందజేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు, తీవ్రమైన శారీరక రుగ్మతలు ఉన్నవారికి నెలకు రూ. 4,016 లభిస్తోంది. అంతేకాకుండా ఫైలేరియా బాధితులకు కూడా ప్రతి నెలా రూ. 2,016 ఆర్థిక సాయం అందుతోంది.

సమగ్ర భూ సర్వే చేపట్టి ‘భూ భారతి’ ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ మ్యాప్‌తో సహా భూమి హక్కు పత్రాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అనర్హుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేస్తామని, అర్హులైన పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. అలాగే రెండు మూడు రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నాడు. అంతే కాకుండా.. రాబోయే మొదటి పంటకే సాగునీరు అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం పేదల భరోసా కోసం నిరంతరం శ్రమిస్తుందని ప్రజలు ఎవరూ అధైర్యపడకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.