Reading Time: < 1 minute
మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి

చండీపూర్‌, ఆగస్ట్‌ 6: భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒడిశాలోని చండీపూర్ సమీకృత పరీక్షా పరిధి (Integrated Test Range-ITR) నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 (Agni-4)ను విజయవంతంగా ప్రయోగించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా చేరుకొని అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగం అనంతరం అగ్ని-4 నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవడంతో భారత క్షిపణి సాంకేతికత మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. ఈ విజయంతో దేశీయ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ప్రయోగానికి ముందు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ 3,000 కిలోమీటర్లకు పైగా పరిధిలో NOTAM (Notice to Air Missions) ఆంక్షలను అమలు చేసింది. దీంతో ప్రయోగం అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య విజయవంతంగా నిర్వహించబడింది. అగ్ని శ్రేణికి చెందిన క్షిపణులు భారత వ్యూహాత్మక నిరోధక సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజా విజయవంతమైన పరీక్షతో భారత రక్షణ పరిశోధన, క్షిపణి అభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది.