
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మాజీ చీఫ్ టెవోల్డే గెబ్రెమరియం నియమితులయ్యారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా బుధవారం (ఆగస్ట్ 5) అధికారిక ప్రకటన చేసింది. ఎయిరిండియా మాజీ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ స్థానంలో గెబ్రెమరియం బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్యాంప్బెల్ విల్సన్ 2026, సెప్టెంబర్ 30 వరకు విధుల్లో కొనసాగుతారు. ఆ తర్వాత టెవోల్డే గెబ్రెమరియం ఎయిరిండియా పగ్గాలు చేపడతారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలు, భద్రతాపరమైన, కార్యాచరణ సవాళ్లను అధిగమిస్తూ సంస్థను అంతర్జాతీయంగా విస్తరించడంతో పాటు లాభాల బాట పట్టించడం టెవోల్డే గెబ్రెమరియం ముందున్న ప్రధాన లక్ష్యాలు.
టెవోల్డే గెబ్రెమరియం ట్రాక్ రికార్డ్:
విమానయాన రంగంలో టెవోల్డే గెబ్రెమరియంకు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన దశాబ్దానికి పైగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ సీఈఓగా సక్సెస్ ఫుల్గా పనిచేశారు. తన హయాంలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ను ఆఫ్రికాలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా అత్యంత లాభదాయకమైన ఎయిర్లైన్గా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ను తీర్చిదిద్దారు.