
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో మరోసారి రాజకీయ చర్చకు తెరలేచింది. ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ భేటీపై బీజేపీ నేత, మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే స్పందిస్తూ.. కూటమిలో విభేదాలు, అనుమానాలు తలెత్తేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సునేత్ర పవార్కు సూచించినట్లు సమాచారం.
ప్రశాంత్ కిశోర్ ముంబైలోని దక్షిణ ముంబై ప్రాంతంలో ఉన్న సునేత్ర పవార్ అధికారిక నివాసం ‘దేవగిరి’లో ఆమెను కలిసినట్లు ఎన్సీపీ నేత సంజయ్ ఖోడ్కే తెలిపారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను ఎన్సీపీ వెల్లడించలేదు. సునేత్ర పవార్తో ప్రశాంత్ కిశోర్ భేటీపై స్పందించిన మంత్రి చంద్రశేఖర్ బావన్కులే.. ఇది ఎన్సీపీ అంతర్గత వ్యవహారమని అన్నారు. అయితే మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో కూటమిలో అనుమానాలు లేదా అపనమ్మకం ఏర్పడేలా ఎలాంటి చర్యలు ఉండకూడదని సూచించారు. ప్రశాంత్ కిశోర్తో సునేత్ర పవార్ ఎందుకు సమావేశమయ్యారనే అంశంపై తాను మరింతగా మాట్లాడదలచుకోలేదని అన్నారు. అయితే ఈ తరహా భేటీలు కూటమిలో విభేదాలు లేదా అపనమ్మకానికి దారితీయకూడదని స్పష్టం చేశారు.
సునేత్ర పవార్, ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ఇది రెండోసారి. సునేత్ర పవార్ భర్త, అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జనవరిలో బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన తర్వాత నుంచి వీరి మధ్య భేటీలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం కూడా ప్రశాంత్ కిశోర్ సునేత్ర పవార్ను కలిశారు. ఆ సమయంలో సునేత్ర పవార్ కుమారుడు, ఎన్సీపీ నేత పార్థ్ పవార్ స్పందిస్తూ.. ప్రశాంత్ కిశోర్ తమ కుటుంబానికి సుపరిచితుడేనని తెలిపారు.
ప్రధాని మోడీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నేతల ఎన్నికల వ్యూహాలను రూపొందించిన ప్రశాంత్ కిశోర్.. ఇటీవల బీహార్లో జరిగిన బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన సునేత్ర పవార్తో భేటీ కావడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ, సునేత్ర పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతి కూటమిగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే కూటమి నుంచి సునేత్ర పవార్ బయటకు వచ్చేయవచ్చన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే హుటాహుటినా ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ప్రధాని మోడీని కలవనున్నారు. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.