
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ రెండు బిల్లుల కోసం ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పార్లమెంట్ను ప్రొరోగ్ (సమావేశాలను అధికారికంగా ముగించడం) చేయకుండా ఉంచే అవకాశం ఉంది. దీంతో అవసరమైన సమయంలో తక్షణమే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశం కలుగుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లులు కావడంతో డీలిమిటేషన్ బిల్లుకు సభలో 2/3 వంతు మెజారిటీ అవసరం. ప్రస్తుతం సంఖ్యా బలాన్ని సమీకరించే పనిలో బీజేపీ ఉంది. అవసరమైన మద్దతు లభించిన వెంటనే సమావేశాలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల కోసం కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చింది. అయితే, సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లులకు ఆమోదం లభించలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత, టీఎంసీ నుంచి గెలుపొందిన మెజారిటీ ఎంపీలు ఇప్పుడు ఎన్డీయేకు మద్దతుగా నిలుస్తున్నారు. తమిళనాడులో కాంగ్రెస్తో డీఎంకేకు దూరం పెరగడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా ఉంది.
లోక్సభ సంఖ్యా బలం ఇదే..
లోక్సభలో మొత్తం 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలంటే 360 ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీయేకు గత ఎప్రిల్ నెలలో 298 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. స్వయంగా ఎన్డీయే సర్కార్కు 293 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు, టీఎంసీ రెబెల్ ఎంపీలు 20 మంది, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు పొందగలిగితే డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం అవుతుంది. ఈ రెండు పార్టీలు కూడా మద్దతు ఇస్తాయనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఇటీవల షిండే శివసేనలో చేరారు. శరద్ పవార్కు చెందిన 8 మంది ఎంపీలు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల సుప్రియా సూలే వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తు్న్నాయి. ఇక ఉద్ధవ్ పార్టీకి మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. అవసరమైన సవరణలు చేస్తే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో 360 ఫిగర్కు మరో ముగ్గురు ఎంపీల దూరంలో ఉంది. యూపీలో లోక్సభ సీట్లు పెరిగితే తమకు లాభం చేకూర్చుతుందనే ఉద్దేశం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపార్టీ(ఎస్పీ)లో కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఎస్పీ కూడా డీలిమిటేషన్కు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.