
తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..? ఆ మాత్రం అలర్ట్గా ఉండకపోతే… మొదటికే మోసం వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోందా? కాంగ్రెస్ నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శల్ని ఎలా కౌంటర్ చేయాలో క్లారిటీ వచ్చేసిందా? ఏంటా మార్పు? కారు పార్టీ కొత్త వ్యూహం ఎలా ఉంది? రాజకీయాల్లో పరస్పర విమర్శలు కామన్. పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ముదిరి అప్పుడప్పుడూ సొంత పార్టీ వాళ్ళనే టార్గెట్ చేసే ట్రెండ్ కూడా ఉంది. ఎవరు ఎవరి వేలెత్తి చూపినా… అది రాజకీయంగా ఉన్నంత వరకు ఓకేగానీ…. ఇంకాస్త దిగి వ్యక్తిగతందాకా వచ్చినప్పుడే సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఇలాంటి వాతావరణమే పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయట. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ తరహా ఆరోపణల్నే గూలాబీ దళం సీరియస్గా తీసుకుంటోందట.
హరీష్రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురవకుండా ఉండటం కోసం మాజీ మంత్రి అలా చేయిస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. అలాంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీలో వాళ్లు, వీళ్ళు అన్నారంటే వేరేగానీ… ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ నోటి నుంచి కూడా ఆ తరహా వ్యాఖ్యలు రావడాన్ని బీఆర్ఎస్ చాగా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… తనమీద నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించారంటూ కాంగ్రెస్ నేతల మీద లీగల్ యాక్షన్కు సిద్ధమయ్యారు హరీష్రావు. ఆరోపణలు చేసిన నాయకులకు లీగల్ నోటీసులు పంపించారాయన. వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో చెప్పారు హరీష్ రావు. ఇలా ఎందుకంటే…. అధికార పార్టీని కట్టడి చేయడం, అనవసరమైన రాజకీయ రచ్చను తిప్పికొట్టడానికి లీగల్ నోటీసులే రక్ష అని భావిస్తున్నామంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
గతంలో అప్పటివరకు ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన కొత్తల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏకంగా ఓ మంత్రికే లీగల్ నోటీసులు పంపించారు. తన మీద నిరాధార ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు కేటీఆర్. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో తమ మీద ప్రత్యర్థులు చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసులు పంపించారు బీఆర్ఎస్ లీడర్స్. ఇక తాజాగా క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించి క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారు హరీష్రావు. ఇక నుంచి ఎవరైనాసరే… ఈ రకంగా పార్టీ మీద, నేతల మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే… రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. గతంలో రాజకీయాల్లో ఇలాంటి పర్సనల్ డ్యామేజ్ స్టేట్మెంట్స్ ఉండేవి కావని, ఇప్పుడు మాత్రం అవే ఎక్కువై పోయాయని అంటున్నారు నేతలు.
అలాగే… ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కాబట్టి…. ఆరోపణలకు తాము సమాధానం చెప్పేలోపే లక్షల మందికి చేరిపోతోందని, దానివల్ల తమ ప్రతిష్ట దెబ్బ తింటోందని కూడా అంటున్నారు. అందుకే…. అలాంటి వాటికి ముందే చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే… ఇలా లీగల్ రూట్ ఎంచుకున్నామని, ఆధారాలు లేకుండా చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని ఇక మీదట లాతోనే కొడతామని అంటున్నారు కారు పార్టీ నాయకులు. వచ్చిన మాటకు వచ్చినట్టు నోటీసులు పంపిస్తే… నిరాధార ఆరోపణల ఉధృతి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తే మరో ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం, మాటకు మాట జవాబు చెప్పడం లాంటివి చేశామని, ఇక నుంచి మరో లెక్క అన్నట్టు ఉంటుందని చెబుతున్నాయి గులాబీ వర్గాలు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తమపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ముందుగానే ఊహించామని, అందుకోసమే లీగల్ టీంను కూడా సిద్ధం చేసుకున్నామని అంటున్నారు. ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్ళు ఉన్నందున అధికార పార్టీ తమపై విమర్శల డోసు పెంచుతుందని అంచనా వేస్తోంది బీఆర్ఎస్. ఇలా లీగల్ నోటీసులతో గట్టిగా కౌంటర్ ఇస్తేనే అధికార పక్షం దూకుడు తగ్గుతుందని భావిస్తున్నారట. మొత్తం మీద మీరు నోటితో కొట్టాలని చూస్తే… మేం నోటీస్తో కొడతామంటూ కాంగ్రెస్ను హెచ్చరిస్తున్నారు కారు పార్టీ లీడర్స్.