Reading Time: < 1 minute
Ap Govt Approves Rs 1 50 Power Supply For Aqua Farmers

AP Govt Approves Rs.1.50 Power Supply for Aqua Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆక్వా చెరువులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్‌ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు కొంత మేర ఊరట దక్కింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రైతుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకుడు తులసి రాంబాబు మాట్లాడుతూ.. విద్యుత్ సబ్సిడీ నిర్ణయం రైతులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందన్నారు. అయితే విద్యుత్‌ రాయితీతో పాటు ఆక్వా ఫీడ్ ధరలను కూడా ప్రభుత్వం నియంత్రిస్తే నష్టాల బాటలో ఉన్న రైతులు పూర్తిగా గట్టెక్కే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారని తులసి రాంబాబు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు కొనసాగించాలని ఆక్వా రైతులు ఆకాంక్షించారు. జూలై 1 నుంచి ఆక్వా చెరువులకు రుపాయిన్నరకు కరెంట్ అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఫీడ్ ధరలను నియంత్రిస్తే కోలుకుంటాం అని ఆక్వా రైతులు అంటున్నారు.