Reading Time: 2 minutes
Delhi Techie Kills Wife Inspired By Web Series Flees With Rs 12 75 Lakh

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వెబ్ సిరీస్‌లో చూపించిన నేర పద్ధతిని స్ఫూర్తిగా తీసుకున్న 62 ఏళ్ల సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని మాయం చేసి, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. భార్య దగ్గర ఉన్న నగదుతో పాటు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు తీసుకుని మొత్తం రూ.12.75 లక్షలతో పరారయ్యాడు. మూడు రోజుల పాటు గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు కమల్ సింగ్ (62), అతడి భార్య కోమల్ సింగ్‌తో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. జూలై 30న ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. వారి కుమారుడు లైబ్రరీకి వెళ్లగా.. కుమార్తె ఆఫీసుకు వెళ్లింది. ఇంటి పనిమనిషి కూడా పని ముగించుకుని వెళ్లిపోయింది. మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో కోమల్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా.. కమల్ వెనుక నుంచి ఆమె తలపై కత్తితో బలంగా కొట్టాడు. అయితే ఆ దెబ్బకు ఆమె కిందపడిపోలేదు. వెంటనే గట్టిగా కేకలు వేస్తూ వంటగదిలోకి పరుగెత్తి దాక్కునేందుకు ప్రయత్నించింది. కమల్ ఆమెను జుట్టు పట్టుకుని లివింగ్ రూమ్‌లోకి ఈడ్చుకొచ్చి, కత్తెరతో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. కోమల్ కేకలు చుట్టుపక్కల వారికి వినిపించినప్పటికీ ఎవరూ జోక్యం చేసుకోలేదని పోలీసులు తెలిపారు. కమల్ తండ్రి కూడా అతడి తల్లిని వెళ్లి ఏం జరుగుతుందో చూడాలని కోరినప్పటికీ.. ఇది వారి కుటుంబ వ్యవహారమని ఆమె పట్టించుకోలేదని సమాచారం.

భార్యను హత్య చేసిన అనంతరం కమల్ రక్తంతో తడిసిన తన దుస్తులు, కత్తిని ఓ బ్యాగ్‌లో పెట్టాడు. అనంతరం సుమారు 15 నిమిషాల పాటు స్నానం చేసి స్కూటర్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మార్గమధ్యలో ఆ బ్యాగ్‌ను పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత భార్య గదిలో ఉన్న రూ.5 లక్షల నగదును తీసుకున్నాడు. మరోవైపు రెండు బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.7 లక్షలు విత్‌డ్రా చేశాడు. దీంతో అతడి దగ్గర మొత్తం రూ.12.75 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కమల్ దంపతుల 26 ఏళ్ల కుమారుడు గౌరవ్ సింగ్ పలుమార్లు తల్లికి ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. రాత్రి 9.15 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న అతడు.. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. ఆమె పక్కనే హత్యకు ఉపయోగించిన కత్తెరను పోలీసులు గుర్తించారు. అయితే మరో కీలక ఆయుధమైన కత్తి మాత్రం కనిపించలేదు. కమల్ అప్పటికే ఇంటి నుంచి పరారవడంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక నిఘా, ఎలక్ట్రానిక్ ఆధారాలతో అతడి కదలికలను ట్రాక్ చేశారు. తొలుత కమల్ తన మొబైల్ ఫోన్ ఆన్ చేసి గోరఖ్‌పూర్ వైపు వెళ్లాడు. దీంతో అతడు నేపాల్‌కు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు భావించారు. అయితే గోరఖ్‌పూర్ చేరుకున్న తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, అక్కడి నుంచి మథుర వైపు వెళ్లి దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు.

మూడు రోజుల పాటు కొనసాగిన గాలింపు అనంతరం మథుర రైల్వే స్టేషన్ సమీపంలో కమల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి స్కూటర్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు మొత్తం నగదును కూడా పోలీసులు రికవరీ చేశారు. విచారణలో కమల్ హత్యకు సంబంధించిన వివరాలను.. అనంతరం తాను అమలు చేసిన పరారీ ప్రణాళికను పోలీసులకు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ క్రైమ్ వెబ్ సిరీస్ ‘ది స్టెయిర్‌కేస్’లో చూపించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని ధ్వంసం చేసి ఆధారాలను బలహీనపరచాలని తాను భావించినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కమల్ నేపాల్‌కు పారిపోయేందుకు కూడా ప్రణాళిక రూపొందించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఆస్తి వివాదమే ప్రధాన కారణం

కమల్, కోమల్ దంపతుల మధ్య గత ఏడాది కాలంగా తీవ్ర విభేదాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముంబై పర్యటన సందర్భంగా కమల్ మరో మహిళకు దగ్గర కావడం కూడా దంపతుల మధ్య సమస్యలను మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ ఇద్దరూ వేర్వేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించే స్థాయిలో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో జగత్‌పురిలో ఓ ఆస్తిని కొనుగోలు చేసి తన తండ్రి పేరుపై రిజిస్టర్ చేయించాలని కమల్ భావించాడు. అయితే ఆ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలని కోమల్ డిమాండ్ చేయడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ ఆస్తి వివాదమే హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.