
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి లీగల్ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే బిగ్ బాస్ కొత్త సీజన్ ఏర్పాట్లతో బిజీగా ఉన్న సమయంలో, ఆయన పేరు ఇప్పుడు ఒక చీటింగ్ కేసులో వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి చండీగఢ్ జిల్లా కోర్టు నుండి లీగల్ నోటీసులు అందుకోవడం సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’ ఫౌండేషన్ బ్రాండ్ పేరిట నడుస్తున్న జ్యువెలరీ వ్యాపారంలో జరిగిన ఒక పెద్ద మోసం (చీటింగ్) ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించే ట్రస్ట్లో అల్విరా ఖాన్ కీలక బాధ్యతల్లో ఉండటంతో ఆమె పేరును కూడా చేర్చడం జరిగింది.
ఈ వివాదానికి గల అసలు కారణాన్ని పరిశీలిస్తే, చండీగఢ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ గుప్తా మణిమాజ్రా ప్రాంతంలో ‘బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ’ ఫ్రాంచైజీ షోరూమ్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయన సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ బ్రాండ్ లైసెన్స్ కలిగి ఉన్న ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ’ సంస్థతో దాదాపు రూ. 3 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, షోరూమ్ ప్రారంభించిన తర్వాత ఒప్పందం ప్రకారం సంస్థ నుండి ఎటువంటి ప్రమోషన్లు కల్పించలేదని, అలాగే విక్రయాలకు అవసరమైన స్టాక్ను కూడా సరఫరా చేయకుండా నిలిపివేసి భారీగా నష్టపరిచారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు.
బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ప్రతినిధులుగా, బ్రాండ్ లైసెన్సింగ్ వ్యవహారాల్లో భాగస్వాములుగా ఉన్నందున సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్ ఇద్దరినీ చండీగఢ్ న్యాయస్థానం బాధ్యులుగా పేర్కొంది. బాధితుడు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు, ఈ మోసం కేసుపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ 2026 అక్టోబర్ 5న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారగా, దీనిపై సల్మాన్ లీగల్ టీమ్ త్వరలోనే వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే కేసులతో డీలా పడ్డ సల్మాన్ కు ఇది కూడా తలనొప్పిగా మారుతుందేమో అని అభిమానులతో పాటు వ్యాపార వర్గాలు కూడా ఈ కేసు పరిణామాలపై ఆసక్తిగా గమనిస్తున్నాయి.