
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫేయిరి టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ట్యాగ్లైన్. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్పై విమర్శల వర్షం కురుస్తోంది. టీజర్లో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ టీజర్పై కర్ణాటక రాష్ట్ర మహిళ కమిషన్కు ఆప్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళ కమిషన్ రంగంలోకి దిగింది. ఈ వివాదంపై తగిన చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
టీజర్లో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ మహిళ కమిషన్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న మహిళ కమిషన్, సమస్యను తొందరగా పరిష్కరించాలంటూ.. సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.