Reading Time: 2 minutes
Congress Mla Virendra Jati Cut Off Electricity Supply To Homes Of Officials

దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ వేధించే సమస్య విద్యత్ అంతరాయం. కరెంట్ కోతలతో దేశంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పలు ప్రాంతాలు విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో విసుగు చెంది ప్రజలు రోడ్లపైకెక్కి నిరసనలకు దిగడం చూసే ఉంటారు. అయితే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తరచుగా విద్యుత్ కోతలతో విసుగు చెంది అధికారులకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారుల ఇళ్లకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. తానే స్వయంగా స్తంభం ఎక్కి వైర్లను కట్ చేశాడు.

Also Read:DK Shivakumar: డీకే.శివకుమార్‌లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేను హరిద్వార్ జిల్లాలోని ఝబ్రేడాకు చెందిన శాసనసభ్యుడు వీరేంద్ర జాతిగా గుర్తించారు. ఎమ్మె్ల్యే స్తంభం ఎక్కి ఆ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను కట్ చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో, ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి బోట్ క్లబ్‌లోని సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ రాజ్‌పుత్ అధికారిక నివాసం వెలుపల ఉన్న విద్యుత్ స్తంభంపైకి నిచ్చెన ఎక్కి అతని ఇంటికి విద్యుత్ కనెక్షన్‌ను కత్తిరించినట్లు కనిపిస్తోంది. తరువాత, అతను చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండే అధికారిక నివాసాలకు వెళ్లి, వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసాడు.

Also Read:Vegetarian Diet Benefits: నాన్ వెజ్ బంజేస్తే ఎలాంటి లాభాలున్నాయో తెలుసా..

రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో వీరేంద్ర జాతిపై విద్యుత్ శాఖ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సరైన షట్‌డౌన్ లేకుండా విద్యుత్ సరఫరాను కట్ చేశారని, అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆ శాఖ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ప్రభుత్వ పనిలో ప్రత్యక్ష జోక్యం అని ఆ విభాగం ఆరోపించింది. అయితే, వీరేంద్ర జాతి తన చర్యలను సమర్థించుకుంటూ, తన ప్రాంతంలో రోజుకు ఐదు నుండి ఎనిమిది గంటలు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, వ్యాపారులు నష్టపోతున్నాయని ఆరోపించారు. గత 10 రోజుల్లో విద్యుత్ శాఖతో ఈ సమస్యను పలుమార్లు లేవనెత్తానని, కానీ వారు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.