
హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు ముగిశాయి. కమిటీ సభ్యులతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని TGSRTC జేఏసీ నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి కమిటీ 4 వారాల సమయం కోరింది. అయితే.. కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని.. గత్యంతరం లేకనే సమ్మెకు వెళ్తున్నామని RTC జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మీడియాకు తెలిపారు.
తమ సమస్యలు కొత్తవేం కాదని, గతం నుంచి ఉన్నవేనని ఆయన చెప్పారు. ప్రభుత్వ మేనిఫెస్టోలోని అంశాలే తాము అడుగుతున్నామని RTC జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి చెప్పారు. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతుందని, 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని RTC JAC నాయకులు తెలిపారు.
►ALSO READ | వికారాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కిన మహిళా సీఐ, ఎస్ఐ !
ప్రభుత్వానికి తమ సమస్యలను వివరించామని, తమ డిమాండ్లు అన్నీ పాత డిమాండ్లేనని చెప్పారు. ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదని TGSRTC జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక జేఏసీ తమ డిమాండ్లను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని, చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు మండిపడ్డారు. అర్థరాత్రి నుంచి సమ్మె కొనసాగుతుందని, ఎవ్వరి ఒత్తిళ్లకు తాము లొంగమని RTC JAC నాయకులు స్పష్టం చేశారు. TGSRTC ఉద్యోగ సంఘాలు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.