Reading Time: < 1 minute
New Scheme In Telangana %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b %e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b %e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4 %e0%b0%b8%e0%b1%8d

తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో “తొలి ముద్ద” అనే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇకపై ప్రతిరోజూ ఉదయం పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం అందనుంది. చిన్నారులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలను బ్రేక్ ఫాస్ట్‌గా అందిస్తారు.

అంగన్‌వాడీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, పారదర్శకత కోసం అంగన్‌వాడీ వర్కర్లకు ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని.. వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి తన ప్రసంగంలో దేశాభివృద్ధికి విద్య, నీటిపారుదల ఎంత ముఖ్యమో, రాబోయే తరం ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు.

Also Read:Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..

‘దేశంలో ఆహార భద్రత ఉంది.. కానీ పోషకాహార భద్రత కరువైంది. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం’ అని అన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందకపోతే.. అది భవిష్యత్తులో వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ టీచర్ల పాత్ర..

ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాల్సింది అంగన్‌వాడీ టీచర్లే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత టీచర్లపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. “తొలి ముద్ద” పథకం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా.. తెలంగాణ భవిష్యత్ పౌరుల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాది వేయనుంది. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడంలో ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలవనుంది.