
హైదరాబాద్ నగర శివారుల్లో, నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. శాసనసభలో మైనింగ్ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. మైనింగ్ శాఖ అనేది రాష్ట్రానికి పన్నేతర ఆదాయాన్ని (Non-Tax Revenue) సమకూర్చే అత్యంత కీలకమైన శాఖ అని, ఇక్కడ ప్రభుత్వం , అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అంత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ముఖ్యంగా స్టోన్ క్రషర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ (జీఓ నెంబర్ 26) నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, దీన్ని ఒక సద్విమర్శగా తీసుకుని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. తాను సేకరించిన అన్ని డాక్యుమెంట్లను మంత్రికి అందజేస్తానని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.