Reading Time: < 1 minute

హైదరాబాద్: ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఇసిఎండబ్ల్యుఎఫ్ తెలిపింది. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో  వేసవి కాలంలో ఉరుములతో కూడిన వర్షాలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. గత గణాంకాల ప్రకారం 2002 (48.8°C), 2003 (48.7°C), 2015 (47.6°C)లో విజయవాడలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఎల్ నినో ప్రభావంతోనే సంభవించాయని పేర్కొంది.  ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాతావరణ మార్పుల వల్ల ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా ఉంటుందని, ప్రమాదాల బారి నుండి తప్పించుకోవడానికి ఉదయం 8, 9 గంటల తర్వాత ప్రయాణాన్ని మొదలుపెట్టి, సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణం ముగించాలని సూచించింది. ఈ వారంలో ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలకు పెరిగి ‘మినీ సమ్మర్’ను తలపించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అయితే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 16-19 డిగ్రీలకు పడిపోయి వాతావరణం చల్లగా ఉంటుందని అంచనా వేసింది.